హైదరాబాద్ లో ఆస్తి పన్ను ఎగవేతదారులకు  లాస్ట్ వార్నింగ్

హైదరాబాద్ లో  ఆస్తి పన్ను ఎగవేతదారులకు  లాస్ట్ వార్నింగ్
  • కమర్షియల్ ఆస్తుల బకాయిలు  రూ. వెయ్యి కోట్లకు పైనే  
  • టాప్ ​టెన్​ లిస్ట్​ రిలీజ్​ 
  •   రెడ్ నోటీసుల జారీ 
  • మార్చి31తో ముగియనున్న ఓటీఎస్ గడువు 
  • స్పందించకపోతే ఆస్తుల జప్తు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  మహా నగరంలో ఏండ్ల తరబడి ఆస్తి పన్ను ఎగవేస్తున్న బడా సంస్థలు, బడా బాబులపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. పలు కార్పొరేట్ సంస్థలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఎన్నో ఏండ్లుగా పన్ను కట్టకుండా తప్పించుకుంటుండడంతో వారి చిట్టాను బయటకు తీసింది. నగరంలోని ప్రధాన ఏరియాలతో   పాటు పలు ప్రాంతాల్లోని కమర్షియల్ ప్రాపర్టీల యజమానుల నుంచి సుమారు రూ.900 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది. వీరిపై లీగల్ యాక్షన్‌‌కు దిగే ముందు ఫైనల్ వార్నింగ్‌‌గా వీరందరికీ ‘రెడ్ నోటీసులు’ జారీ చేస్తున్నది.  

టాప్ ​టెన్ ​వీరే.. 

జీహెచ్ఎంసీ సిద్ధం చేసిన టాప్ టెన్​డిఫాల్టర్ల లిస్టులో  ‘హైదరాబాద్ ఆస్బెస్టాస్ సిమెంట్’ సంస్థ ఏకంగా రూ.13 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కృపా దేవి అండ్​అదర్స్​రూ. 6.4 కోట్లు, శ్రీ లక్ష్మీ గాయత్రి హోటల్స్ (కత్రియా హోటల్స్) రూ.6.13 కోట్లు, జూబ్లీహిల్స్‌‌కు  చెందిన సందేశ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.4.45 కోట్లు, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.3.5 కోట్లు, ఐటీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.3.5 కోట్లు, రాజేంద్రనగర్ పరిధిలోని ఎం.ఎస్ సుందర్ స్టీల్స్ రూ.2.95 కోట్లు, అషీ రియల్టర్స్ రూ.2.37 కోట్లు, యూసుఫ్‌‌గూడకు చెందిన ప్రీ స్టీల్స్ ఫ్యాబ్రిక్స్ రూ.2.23 కోట్లు, ప్రముఖ లీలా హోటల్స్ (హోటల్ లీలా వెంచర్స్) రూ.1.5 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని జీహెచ్ఎంసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

ప్రాపర్టీలు జప్తు చేసుడే.. 

ఈ బడా బకాయిదారుల నుంచి పన్ను వసూలు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. రెడ్ నోటీసులు అందుకున్న తర్వాత కూడా పన్ను చెల్లించని పక్షంలో జీహెచ్ఎంసీ యాక్ట్ లోని సెక్షన్ 269 కింద 'డిస్ట్రెస్ వారంట్లు' జారీ చేసి, ప్రాపర్టీలు, షాపులను సీజ్ చేయడంతో పాటు, మూవబుల్ ఆస్తులైన వాహనాలను సైతం జప్తు చేస్తామని అధికారులు 
హెచ్చరిస్తున్నారు.